సౌదీ ప్రభుత్వం, భారత్ నుంచి వచ్చిన ఇద్దరు వలసదారులకు మరణశిక్ష విధించింది. పంజాబ్కు చెందిన వీరిద్దరూ మరో భారతీయుడిని హత్య చేసినందుకుగానూ ఈ శిక్షను అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. సత్వీందర్ కుమార్, హర్జీత్ సింగ్ అనే ఈ ఇద్దరు ఇమాముద్దీన్ అనే మరో భారతీయుడితో కలిసి దొంగతనాలు చేసేవారు. అలా దోచుకున్న సొమ్మును పంచుకునే సమయంలో వారి మధ్య గొడవ వచ్చింది. దీని తో వీరిద్దరూ కలిసి ఇమాముద్దీన్ను హతమార్చి.. మృతదేహాన్ని పారేశారు.
ఈ హత్య కేసు దర్యాప్తు జరుగుతుండగానే వీరిద్దరూ మద్యం మత్తులో రోడ్డుపై గొడవపడి అరెస్టయ్యారు. వీరిని సౌదీ నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించడంతో.. అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఇంతలో ఇమాముద్దీన్ హత్య కేసుతో వీరికి సంబంధం ఉందని తేలింది. చివరకు వీరే అతన్ని హతమార్చారని తేలడంతో న్యాయస్థానం వీరికి మరణశిక్ష విధించింది. ఫిబ్రవరి 28న వీరి శిక్షను అమలు చేశారు. అయితే సౌదీ చట్టాల ప్రకారం, వీరి మృతదేహాలను భారత్కు పంపించడం కుదరదు.