తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుల ఎంపికపై సర్వత్రా అందరి దృష్టి నెలకొన్నది. టీటీడీ పాలకమండలి దాదాపుగా ఖరారైంది. మొత్తం 25 మంది సభ్యులతో కూడిన మండలిలో తెలంగాణ నుంచి ఐదుగురికి, కర్ణాటక నుంచి ఇద్దరు, తమిళనాడు నుంచి ఇద్దరికీ చోటు దక్కింది. ఇక వివిధ రాష్ట్రాల నుంచి సేవాభావం కలిగిన 50 మంది వ్యక్తులకు ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ అవకాశం ఇచ్చింది.. మొత్తం 75 మంది సభ్యులతో పాలక మండలి ఉండనున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
భారతదేశంలో ఉన్న వైష్ణవ క్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రపంచ వ్యాప్తంగా అశేషమైన భక్తజనం ఉన్నారు. వీరిందరికీ కూడా టీటీడీనే అన్నిరకాల వసతి, సదుపాయాలను కల్పిస్తోంది. ఈ పాలక మండలిలో సభ్యత్వం లభించిన వారికి నేరుగా శ్రీవారిని సేవించుకునే అవకాశం దక్కుతుంది.
ఇదిలా ఉంటే..ప్రతీ రెండేళ్లకోసారి టీటీడీ పాలకమండలి ఛైర్మన్ తోపాటు సభ్యులు మారుతూ ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా మరోసారి వైవీకే ఆ అదృష్టం దక్కింది.
దీంతో కొత్తగా పాలక మండలి సభ్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాలక మండలి సభ్యుల సంఖ్యను ప్రభుత్వం గతంలో 40కి పెంచింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగనుందనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. దీంతో ఆశావహులు సైతం టీటీడీలో నామినేటేడ్ పదవిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో జాబితాపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలోనే టీటీడీ పాలకమండలిపై చర్చించి, ఆ తర్వాత జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.