తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని టీఎంయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాంటి రాష్ట్రంలో నేనే రాజు.. నేనే మంత్రి అంటే కుదరదన్నారు. తాము చేపట్టిన సమ్మె విషయంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే రాజ్యాంగ సంక్షోభం కూడా రావచ్చని వ్యాఖ్యానించారు అశ్వత్థామరెడ్డి.
ఇప్పటికైన సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని, అలాగే సీనియర్ మంత్రులు హరీశ్రావు, ఈటల మౌనం వీడాలని కోరారు. హైకోర్టు ఆదేశించిన విధంగా తాము సమ్మె విషయంలో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎలా సాధ్యమో చర్చల్లోనే చెబుతామన్నారు అశ్వత్థామరెడ్డి.