ఆర్టీసీ కార్మిక సంఘాల సకల జనుల సమర భేరి సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బుధవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్నగర్ గ్రౌండ్లో సభ జరగనుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రేపు (బుధవారం) సరూర్నగర్లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది.
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సరూర్ నగర్లో రేపు 2గంటల నుంచి 6 గంటల వరకు అనుమతి కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె వలన కార్మికులు చనిపోయారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సరూర్ నగర్ సభ ద్వారా కార్మికులకు ఆత్మ స్టైర్యం కల్పించడం కోసం సభ ను ఏర్పాటు చేశామని వివరించారు. దీనిపై మధ్యాహ్నం విచారించిన న్యాయస్థానం ఈ మేరకు అనుమతి ఇచ్చింది.