తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. పలు ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు వ్యాఖ్యలు, వేతనాలు లేక కార్మికులు పడుతున్న ఇబ్బందులను గవర్నర్ తమిళిసైకి ఆర్టీసీ జేఏసీ నేతలు వివరించారు. ఇక జేఏసీ నేతల విజ్ఞప్తిపై గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.