తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పరిష్కారం కనిపించే పరిస్థితి లేకపోవడంతో కార్మికులు మనస్తాపానికి గురవుతున్నారు. ముషీరాబాద్ డిపోలో పనిచేస్తున్న కైలాష్ అనే డ్రైవర్ గత రాత్రి యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.కుటుంబ సభ్యులు సకాలంలో గమనించి, ఆసుపత్రికి తరలించడంతో అతని ప్రాణాలు దక్కాయి.
టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె 26వ రోజుకు చేరిన విషయం తెలిసిందే. సమ్మె ప్రారంభించిన రోజు సాయంత్రం ఆరు గంటల్లోగా విధులకు హాజరైన వారినే ఉద్యోగులుగా కొనసాగిస్తామని, కాని వారు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ హెచ్చరికను అప్పట్లో కార్మికులు పెద్దగా పట్టించుకోలేదు.
రాను రాను సమ్మె ఉధృతం కావడంతో.. అటు కార్మిక జేఏసీ, ఇటు ప్రభుత్వం ఎవరికి వారే దిగిరాకుండా భీష్మించుకు కూర్చుడడంతో కైలాష్ తీవ్ర మనోవేదనకు గురయినట్టు సమాచారం. దీంతో ఆత్మహత్యా యత్నం చేశాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వైద్యసాయం అందించిన డాక్టర్లు ప్రాణాపాయం లేదని తెలిశాక ఇంటికి తరలించారు.