telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వెనక్కి తగ్గేది లేదు.. : ట్రంప్

trump in america president election race

అమెరికా దళాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇరాక్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ అమెరికా దళాలు వైదొలగాలంటే అక్కడ నిర్మించుకున్న ఎయిర్ బేస్ ఖర్చు మొత్తాన్నీ తమకు చెల్లించాలని అన్నారు. ఇరాన్ సైనిక జనరల్ సులేమానీ హత్యకు నిరసనగా తమ దేశంలోని అమెరికా దళాలను పంపించవేస్తామంటూ ఇరాక్ పార్లమెంటు హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. బలవంతంగా తమ దళాలను వెనక్కి పంపే ప్రయత్నం చేస్తే ఇరాక్‌పై చాలా తీవ్ర స్థాయిలోనే ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఇరాక్‌కు సహకరించేందుకు అమెరికా దళాలు వెళ్లాయి. అప్పటినుంచి కూడా ఇరాక్‌ను అనేక రకాలుగా అమెరికా ఆదుకుంటూ వచ్చింది. అయితే తాజా పరిణామంతో అమెరికా దళాలను దేశం నుంచి పంపేయాలని ఇరాక్ పార్లమెంటు తీర్మానించడంతో ట్రంప్ తీవ్రస్థాయిలోనే ప్రతిస్పందించారు.

ఇప్పటివరకు మేము పెట్టిన ఖర్చంతా తిరిగి చెల్లిస్తే తప్ప ఇరాక్‌ను వీడబోమని ఇరాక్ పార్లమెంటు నిర్ణయంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇరాక్‌లో తమ ఎయిర్ బేస్ నిర్మాణానికి బిలియన్లకొద్దీ డాలర్ల ఖర్చయిందని ఆయన తెలిపారు. ఒకవేళ బలవంతంగా తమ దళాలను ఇరాక్ నుంచి పంపేస్తే మాత్రం గతంలో ఎన్నడూ చూడనంత తీవ్ర స్థాయిలో ఇరాక్‌పై ఆంక్షల మోత మోగిస్తాం అని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌పై తాము విధించిన ఆంక్షల కంటే కూడా ఇరాక్‌పై విధించబోయే ఆంక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని అన్నారు. ‘అసలు ఇరాక్‌లో అమెరికా దళాలు అడుగుపెట్టడమే సరైన నిర్ణయం కాదు. ముఖ్యంగా మధ్య ప్రాచ్యలోకి వెళ్లడం అన్నది అమెరికా చరిత్రలోనే ఇంతవరకూ తీసుకోని అర్థం లేని నిర్ణయం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయినా కూడా ఇరాక్‌లో ఉన్నామని, ఆ దేశాన్ని ఆదుకున్నామని, ఉగ్రవాద మూకలను మట్టుబెట్టామని అన్నారు.

Related posts