యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమదేశానికి చెందిన వస్తువులపై ఇండియా అదనపు పన్నును వేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి తేల్చుకుంటానని వ్యాఖ్యానించారు. తాము సుంకాలను పెంచి, దానికి ప్రతిగా ఇండియా పెంచిన సుంకాలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు.
రేపు(శుక్రవారం) జపాన్ లో జరిగే జీ 20 సదస్సులో తాను మోదీతో భేటీ కానున్నానని, ఇదే విషయమై తాను చర్చించనున్నానని అన్నారు. “గత కొన్నేళ్లుగా అమెరికా వస్తువులపై ఇండియా భారీగా సుంకాలను విధిస్తోంది. ఈ విషయమై నేను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడబోతున్నా. దీనికి తోడు ఇప్పుడు మళ్లీ భారత్ సుంకాలను పెంచింది. దీనిని మేము ఏమాత్రం ఆమోదించబోము. వీటిని వెనక్కు తీసుకోవాల్సిందే” అని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. అమెరికాపై ప్రతీకార చర్యగా, ఇటీవల 28 రకాల దిగుమతి వస్తువులపై భారత్ అదనపు పన్నులు వేసిన సంగతి తెలిసిందే. అమెరికా ఇప్పటికే భారత వస్తువులపై సుంకాలు పెంచింది, దానికి ప్రతి చర్యగా భారత్ ఈ సుంకాలను పెంచింది.
తెలిసే కోమటిరెడ్డి నాటకాలు ఆడుతున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి