తెలంగాణ రాష్ట్రంలో టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్( టీఆర్టీ), గ్రూప్-2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తీపికబురు అందించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మాధ్యమం ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ పూర్తిచేసింది. జాబితాను పునఃపరిశీలించి సోమవారం నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. తొలుత నిర్ణయించిన ప్రకారం గ్రూప్-2 ఫలితాలను ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అదే సమయంలో టీఆర్టీపై మరోసారి రీలింక్విష్మెంట్ తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఎంపిక ప్రక్రియను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు 16 వరకు టీఆర్టీ అభ్యర్థుల నుంచి రీలింక్విష్మెంట్ను తీసుకుంది. ఆపై అదనంగా అర్హత పొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించింది. వీలైనంత త్వరగా టీఆర్టీ నియామకాలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో పండగ సెలవుల్లోనూ టీఎస్పీఎస్సీ అధికారులు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. తొలుత టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మీడియం ఫలితాలు, తరువాత నాలుగైదు రోజుల్లో ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం ఫలితాలు ప్రకటించేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.