తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన మాట తప్పాడని మాజీ హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ జరిగిన మరునాడే కేసీఆర్ తనను మోసం చేశాడని నాయిని వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి, తన అల్లుడికి ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకుండా మాట తప్పారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో బుధవారం నాయిని మీడియాతో చిట్ చాట్ చేశారు. మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి కేటీఆర్ తనను అడిగారని ఆయన చెప్పారు. తాను చిట్ చాట్ చేస్తే పేపర్లో పెద్దగా రాశారని తాను కేటీఆర్ కు చెప్పానన్నారు. తనను కేసీఆర్ పిలిస్తే వెళ్లి మాట్లాడడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ మాదే ఉన్న పదవులు మాకే వస్తాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. నాయిని నర్సింహ్మారెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, జోగు రామన్న తదితరులు కూడ తమ అసంతృప్తిగళాన్ని విన్పించారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం జోగు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.