తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో బెర్తులు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర రావు తన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు అసెంబ్లీకి గెలిచిన తనను కేసీఆర్ అవమానించారని అలక చెందారు. సోమవారం కార్యకర్తల భేటీలో ఆయన కంటతడి పెట్టారు. తనకు ప్రాధాన్యత లేని పదవి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు సార్లు గెలిచినవాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ నాలుగు సార్లు గెలిచిన తనకు ఇవ్వకుండా అవమానపరిచారని వాపోయారు. తనకు ఏ విధమైన పదవులు కూడా వద్దని, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటానని ఆయన చెప్పారు. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటి నుంచి విద్యాసాగర రావు ఎక్కువగా ప్రజల ముందుకు రావడం లేదు. పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యునిగా విద్యాసాగర రావును ఇటీవల నియమించారు. మంత్రి పదవి ఇవ్వకుండా చిన్నపాటి పదవి ఇచ్చారనేది ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.