చంద్రబాబు వల్లే ఉద్యోగుల విభజనలో సమస్యలు తలెత్తాయని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, హైకోర్టు విభజనను ఏపీ సీఎం అడ్డుకున్నారని హరీశ్ రావు విమర్శించారు. మంగళవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ‘2019 డైరీ’ ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదన్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని నిషేధించిన సమయంలోనే టీఎన్జీవో పేరు పెట్టారని గుర్తుచేశారు. లగడపాటి లాంటి వారిని అడ్డుకున్నారు కాబట్టే తెలంగాణ కల సాకారమైందన్నారు. ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు సమ్మెను విజయవంతం చేశారని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఉద్యోగులదేనన్నారు.