తెలంగాణ వచ్చాక ఎక్కడా తాగునీటి సమస్య లేదని మంత్రి హరీష్రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తోందని తెలిపారు. దుబ్బాకలో మంగళవారం ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతుబంధు ఇస్తున్న ఒకే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు మాత్రమేనని అన్నారు.
పంటలకు గిట్టుబాటు ధర అందించామని గుర్త చేశారు. త్వరలోనే ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు ఆసరా ఫించన్లు, బీడీలు చుట్టే మహిళలకు బీడీ కార్మిక భృతి ఇస్తోందని పేర్కొన్నారు. దుబ్బాక నియోజక వర్గంలో 57 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. తొలి కాన్పు తల్లి గారే చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ. 12 వేలు, కేసీఆర్ కిట్ ఉచితంగా ఇస్తోందని పేర్కొన్నారు.