ఒక ట్రాన్స్జెండర్ను భారత ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచారకర్తగా నియమించారు. గౌరీ సావంత్(38) అనే ట్రాన్స్జెండర్ను ఎన్నికల ప్రచారకర్తగా మహారాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. మొత్తం 12 మంది ప్రచారకర్తల్లో సావంత్ ఒకరు. అయితే సెక్స్ వర్కర్స్ కు ఓటింగ్పై అవగాహన కల్పిస్తానని, అన్ని రకాల మహిళలు ఎన్నికల్లో పాల్గొనేలా ప్రాచారం చేస్తానని సావంత్ చెప్పుకొచ్చారు.
ఎన్నికల రోజున సెలవు కావడంతో మహిళలు ఇంట్లో వంట, ఇతర పనులు చేస్తూ సమయం గడుపుతారని అన్నారు. అలాంటి వారిని పోలింగ్ బూతుకు రప్పించే విధంగా కృషి చేస్తానని సావంత్ అన్నారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన గౌరీ సావంత్ పుట్టిన పేరు గణేష్ సావంత్. అయితే వయసులో పెరుగుదలతో పాటే శారీరకంగా, మానసికంగా వచ్చిన మార్పులతో కుటుంబంలో ఇమడలేక సొంతంగా ఒక ఎన్జీవో ప్రారంభించి తనలాంటి ఎంతో మందిని చేరదీస్తున్నారు. ప్రస్తుతం 2,086 మంది ఆ ఎన్జీవో ద్వారా ఆశ్రయం పొందుతున్నారు.