ఢిల్లీ నుంచి రక్సోల్ వెళుతున్న సత్యాగ్రహ్ ఎక్స్ప్రెస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.షాజహాన్పూర్ నుంచి సీతాపూర్ వైపు వస్తుండగా రైలును మొహాలీ వద్ద ఆపివేసి మంటలను అదుపుచేశారు. రైలు చక్రాల వద్ద మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా రైలును 50 నిముషాల పాటు నిలిపివేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ట్రైన్ మొహాలీ స్టేషన్ దాటుతుండగా ఎస్-2 కోచ్ వద్ద నిప్పంటుకుంది.
దీనిని ప్రయాణికులు గమనించి అధికారులకు తెలియజేశారు. దీంతో ట్రైన్ను నిలిపివేసి, మంటలను అదుపుచేశారు. ఈ సమయంలో అటువైపుగా వచ్చే రైళ్ల రాకపోకలను నియంత్రించారు. కాగా ఈ ప్రమాదం బ్రేక్ టూల్ జామ్ అయినందున సంభవించిందని బావిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.