లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 23న జరగనున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు. కౌంటింగ్లో పింక్స్లిప్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. గురువారం ఉత్తమ్ అధ్యక్షతన గాంధీభవన్లో డీసీసీ అధ్యక్షులు, ఎంపీగా పోటీచేసిన అభ్యర్థులతో సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ పంపిన మార్గదర్శకాలను ఉత్తమ్ వివరించారు.
కౌంటింగ్ మొదలు కాకముందే కేంద్రం లోపలికి వెళ్లాలని, ఆ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే అక్కడ్నుంచి బయటకు రావాలని ఏజెంట్లకు సూచించాలని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ వ్యవహరించిన తీరు, పోలింగ్ సరళి ఆధారంగా ఫలితాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. పరిషత్ ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధిస్తామని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.