తెలంగాణ సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా లేఖ రాశారు.ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మార్కుల్లో గందరగోళానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి బాధ్యుడని, వెంటనే ఆయన్ని బర్తరఫ్ చేయాలని లేఖలో కోరారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన అధికారులను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డును మీరెందుకు ప్రక్షాళన చేయడంలేదని దుయ్యబట్టారు.
10 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో కూడిన సమస్యపై ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా? అంటూ ప్రశ్నించారు.అవినీతి ఎక్కడున్నా ప్రక్షాళన చేస్తానని చెబుతుంటారు, మరి ఇంటర్ బోర్డు విషయంలోఎందుకు నిర్ణయం తీసుకోవడంలేదో చెప్పాలని ఉత్తమ్ తన లేఖలో డిమాండ్ చేశారు.ప్రజల సమస్యలను మీరెప్పుడు పట్టించుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణలో రాజకీయ అవినీతిని ప్రోత్సహిస్తున్నారంటూ ఉత్తమ్ తన లేఖలో పేర్కొన్నారు.