ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే వెంటనే టెన్షన్ పడుతున్నారు అభిమానులు. ఇక ఇండస్ట్రీ వర్గాలు కూడా వణికిపోతున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నటి గీతాంజలి మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక ఇప్పుడు అంతలోనే మరో సీనియర్ నటుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. ఆయనే గొల్లపూడి మారుతి రావు. టాలీవుడ్లో ఒకప్పుడు చక్రం తిప్పారు ఈయన. నటుడు మాత్రమే కాకుండా.. రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. చెన్నైలో చికిత్స పొందుతున్న గొల్లపూడి మారుతీరావుని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్య.. గొల్లపూడి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి సరైన ఆరోగ్య వివరాలు కనుక్కున్నారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడాడు. మారుతీరావు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి కోరుకున్నారు.