టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ నుంచి దూరం అయ్యాడు. రెండు రోజుల్లో (జులై 28న) బర్మింగ్హామ్లో ప్రారంభమయ్యే గేమ్లకు ముందు భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా గాయపడ్డాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్లో ఆడడం లేదని తెలుస్తోంది. ఈ పోటీల్లో ఖచ్చితంగా పథకం సాధిస్తాడని ఆశలు రేపిన నీరజ్ గాయం కారణంగా కామన్వెల్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది .
గత ఆదివారం నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నీరజ్ చోప్రా 88.13 మీటర్లు బల్లెం విసిరే సమయంలో కాలికి గాయమైంది.
దీంతో నీరజ్ చోప్రా తొడకు గాయమైందని ఐఓఏ తెలిపింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో నాల్గవ త్రో తర్వాత నీరజ్ చోప్రా తన తొడపై ఒత్తిడిని అనుభవించాడంట. ప్రస్తుతం ఈ గాయం చాలా పెద్దదిగా మారింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
కాగా..ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ తర్వాత, నీరజ్కు (యం ఆర్ ఐ) స్కాన్ చేసినట్లు ఐఓఏ పేర్కొంది. అందులో అతని గాయం బయటపడింది. దీంతో నీరజ్కి ఒక నెలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని ఐఓఏ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాను కామన్వెల్త్ లో ఆడలేనని అతడు చెప్పినట్లు సమాచారం