తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గృహనిర్బంధం చేయడంతో ఆయన ఇంట్లో చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీక్ష విరమింప జేసేందుకు పోలీసులు చర్చలు జరిపినా ఫలితం ఇవ్వలేదు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించేదాకా దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ కార్మికుల న్యాయమైన సమ్మెను ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహారం అలా ఉంటే ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కూడా రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు.
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటూ ఉండడంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి. హైదరాబాద్ తోపాటు ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.