గుంటూర్ జిల్లా ఎడ్లపాడు మండలోని లింగరావుపాలెం గ్రామం నుంచి 27 మంది భక్తులు కాలినడకన తిరుమలకు బయలుదేరారు. గత 15 సంవత్సరాల నుండి గ్రామనికి చెందిన పలువురు భక్తులు ప్రతి సంవత్సరం కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితి. ఇలా కాలినడకన స్వామివారిని దర్శించి మొక్కులు సమర్పిస్తే కోరికలు నెరవేర్తాయని గ్రామస్థుల నమ్మకం. కాటాని మాధవరావు అనే వ్యక్తి పిల్లలు లేకపోవడంతో తనకు సంతానం కలిగితే కాలినడకన తిరుపతికి వచ్చి మొక్కులు తీర్చుకొంటాని గతంలో మొక్కుకున్నాడు.
అనుకున్న ప్రకారం అతనికి ఇద్దరు పిల్లలు జన్మించారు. దీంతో ఆయన అప్పట్లో కాలినడకన బయలుదేరి శ్రీవారిని దర్శించుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆయన బాటలోనే నడుస్తూ కోరిన కోర్కెలు తీర్చిన వెంకన్న స్వామికి మొక్కులు సమర్పించడం గ్రామంలో ఆనవాయితీగా మారింది. ప్రతి రోజు సుమారు 40 నుంచి 45 కి.మీ. నడుస్తూ 9 రోజులకు తిరుమలకు చేరుకొంటారు. ఈ సారి గుంటూర్ జిల్లా నిజాంపట్నం నుంచి మరో 13 మంది భక్తులు లింగరావుపాలెం భక్తులతో కలిసి వెళ్తున్నారు. మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో వీరికి కొన్ని స్వచ్చంద సంస్థలు భోజన వసతి ఏర్పాటు చేస్తారు. రాత్రి వేళలో దేవాలయాలు, కమ్యూనిటి హాళ్లలో బస చేస్తారు. అనంతరం తమ గమ్య స్థానమైన తిరుమలకు వెళ్ళి శ్రీవారికి మొక్కులు సమర్పించి పునీతులవుతారు.