రోజుకో సామజిక మాధ్యమం తయారవుతున్నాయి. అయితే అవన్నీ సరిగ్గా వినియోగించుకోవచ్చు, లేదా వృధా కూడా చేయవచ్చు. కానీ తెల్లటి కాగితంపై చిన్న నల్ల చుక్క ప్రభావం ఎక్కువగా చూపినట్టుగా; అనైతికంగా వాడేవారు ప్రభావం కూడా సమాజం మీద ఎక్కువగా పడుతుంది. ఈ నేపథ్యంలోనే, సోషల్ మీడియాలో నయా సెన్సేషన్ గా మారిన ‘టిక్ టాక్’ యాప్ ను నిషేధించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. ఈ యాప్ లో వస్తున్న అశ్లీల సంభాషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని అభిప్రాయపడ్డ అసెంబ్లీ, యాప్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది.
ఈ విషయాన్ని రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖా మంత్రి మణికంఠన్ అసెంబ్లీలో శాసనసభలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ జరుగుతున్న సందర్భంగా వెల్లడించారు. అంతకుముందు ‘టిక్ టాక్’ యాప్ ను తక్షణమే నిషేధించాలని మనిదనేయ జననాయగ కట్చి శాసనసభ్యుడు తమీమున్ హన్సారీ డిమాండ్ చేశారు. యాప్ లో పలు వర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆపై మంత్రి మణికంఠన్ సమాధానమిస్తూ, యాప్ ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.