అయోధ్య వివాదం పై కీలక తీర్పును వెలువరించిన దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఈ రోజు మరో మూడు కీలక తీర్పులను వెలువరించనుంది. ఈ నెల 17న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ లోగా ఈ తీర్పులను వెలువరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం అయోధ్య తీర్పు వెలువరించిన ఆయన నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు శబరిమలలోకి మహిళల ప్రవేశం, రాఫెల్ యుద్ధ విమానాలు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధిక్కార కేసులపై తీర్పు వెలవరించనుంది. ఈ మూడు తీర్పులు కూడా ముఖ్యమైనవే కావడంతో తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. శబరిమల అయ్యప్ప గుడిలోకి మహిళలను అనుమతించాలని గత ఏడాది సెప్టెంబరు 28న ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలంటూ దాఖలైన 65 పిటిషన్లపై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇవ్వడాన్ని సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపైనా సుప్రీం తీర్పు ఇవ్వనుంది. మరోవైపు.. రాఫెల్ ఒప్పందంలో ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన చౌకీదార్ చోర్ హై అన్న రాహుల్.. తన విమర్శను సుప్రీం తీర్పునకు ఆపాదించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. దీనిపై తీర్పు ఇవ్వనుంది. బిహార్ షెల్టర్ హోమ్లో బాలికలపై అత్యాచారాల కేసుపై ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రిజేష్ ఠాకూర్తో సహా 21 మంది నిందితులపై పోక్సో, అత్యాచారం, నేరపూరిత కుట్ర, ఇతర అభియోగాలు ఉన్నాయి. గత ఫిబ్రవరి 23 నుంచి ఈ కోర్టులో సాధారణ విచారణ జరుగుతుండగా.. దీనికి సంబంధించి నేడు తీర్పు వెలువడనుంది.
ఓటమిని ఒప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు…