telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

ఈ ఏడాది… రైతులకు అనుకూలంగా .. వర్షాలు..

this year good enough rains

భారత వాతావరణ శాఖ ఈ ఏడాది కరవుతీరా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్-సెప్టెంబరు మధ్య సగటు వర్షపాతంలో 96 శాతం నమోదవుతుందంటూ రైతులకు తీపి కబురు చెప్పింది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతమే నమోదవుతుందంటూ ఏప్రిల్ 15న ఇచ్చిన తొలి అంచనా నివేదికలో మరింత సమాచారం జోడించిన వాతావరణ శాఖ రెండో దశ నివేదికను విడుదల చేసింది. చివరి రెండు నెలలకు సంబంధించిన తుది నివేదికను జూలై చివరిలో ఇవ్వనున్నట్టు తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీనమైన ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయని, నైరుతి ముగిసే వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఖరీఫ్‌కు ఎంతో కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా 95 శాతం, 99 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. గత నెల 18న అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 25నాటికి మాల్దీవులు, కొమరన్‌ తీరం వరకు విస్తరించాయి. ఆ తరువాత 4 రోజుల వరకు స్థిరంగా ఉన్న రుతుపవనాలు మే 30న అండమాన్‌లో అన్ని ప్రాంతాలు, ఆగ్నేయ, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి. ఫలితంగా జూన్‌ 6 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Related posts