భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్”. సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తుండగా సునీల్ బోహ్రా, జయంతిలాల్ గదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 11న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్ విడుదలైంది.
ఈ ట్రైలర్ లో “మహాభారతంలో రెండు కుటుంబాలు ఉండేవి. కానీ భారత్ లో ఒకటే ఉంది” అంటూ కాంగ్రెస్ పార్టీ జెండాతో చూపించడం… మన్మోహన్ను ప్రధానిగా ఎంపిక చేసిన నాటి నుంచి రెండు సార్లు ఆయన పదవిలో ఎందుకు కొనసాగారు ? కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ… పదవి కంటే కూడా దేశ శ్రేయస్సే ముఖ్యమంటూ అనుపమ్ చెప్పే డైలాగ్స్ …. కశ్మీర్ వివాదం, అణు ఒప్పందం ప్రక్రియలో భాగంగా పార్టీతో ఆయన విభేదించడం వంటి సున్నితమైన అంశాలు ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవలే ఈ చిత్రం హిందీ ట్రైలర్ విడుదల చేయగా తీవ్ర దుమారం రేపింది. ట్రైలర్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి దుష్ప్రచారం చేసేలా సినిమా ఉంటుందనే సంకేతాలు కన్పిస్తున్నాయని, ఇది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని… తమ కార్యవర్గ సభ్యులకు ముందుగా సినిమాను ప్రదర్శించి, తాము సూచించే మార్పులను చేపట్టకుంటే దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేహాలు హెచ్చరించారు.