దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిడతల దండును తరిమి కొట్టేందుకు రైతులు చేయని ప్రయత్నమంటూ లేదు. డీజే సౌండ్లు, రసాయనాలు చల్లి వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పంటలను సర్వనాశనం చేస్తున్న ఈ మిడతల వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు పంట పొలాలను మింగేసిన ఆ మిడతలతో స్థానిక రెస్టారెంట్లు బిర్యానీ, వేపుళ్లు, కూరలు వండటం మొదలుపెట్టాయి. ‘మకాడ్ బిర్యానీ’ పేరుతో ధార్, జైపూర్ రెస్టారెంట్లలో అమ్మకాలు మొదలుపెట్టారు. ఒక ప్లేటు బిర్యానీని రూ.200కు విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రెస్టారెంట్ యజమాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మిడతలు చాలా రుచిగా ఉంటాయి. అందులో బోలెడన్నీ ప్రోటీన్లు ఉంటాయి. మిడతలను ఉడికించే ముందు బాగా శుభ్రం చేయాలి. దాని కాళ్లు, రెక్కలను తొలగించాలి’’ అని తెలిపాడు. పాకిస్థానీలు మాత్రం వీటిని లొట్టలేసుకుని తినేస్తున్నారట. వాస్తవానికి రాజస్థాన్ రెస్టారెంట్లు ఆ దేశాన్ని చూసే ఈ బిర్యానీ తయారీ మొదలుపెట్టారట. పాకిస్థాన్లోని ఛచ్రో ప్రాంతంలో మిడతలను బాగా వేయించి.. వాటిపై కరివేపాకులు చల్లి స్నాక్స్లా తింటున్నారు. మరోవైపు రుచికరమైన బిర్యానీలను సైతం తయారు చేస్తున్నారు. ఈ బిర్యానీని అక్కడ ‘మాక్ బిర్యానీ’ అని పిలుస్తారు. ఒక ప్లేటు మిడతల బిర్యానీ రూ.300 ధర పలుకుతోంది. మరోవైపు చైనా ప్రజలు మిడతలతో ఎలాంటి వంటకాలు తయారు చేస్తారో తెలిపే వీడియోలను కూడా పోస్టు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా చక్కర్లు కొడుతున్నాయి. ఇక అరబ్ దేశాల్లో మిడతలను సంచుల్లో బంధించి అమ్ముతున్నారు కూడా. వాళ్ళు ఈ మిడతలను పచ్చిగానే తింటున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
Eat them before they eat the crops 🌾🦗 😱 #Locustsattack pic.twitter.com/tMYGwkhdY4
— Danyal Gilani (@DanyalGilani) May 29, 2020