telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ కు షాకిచ్చిన ఐటి అధికారులు… “మాస్టర్” సెట్స్ లోనే 5 గంటలపాటు విచారణ

Vijay

తమిళ నటుడు, దళపతి విజయ్‌ వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఆయన ప్రతి సినిమా వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ‘బిగిల్’ సినిమాను సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్‌ను ఈ చిత్రం వసూలు చేసింది. విజయ్‌కు కూడా భారీ మొత్తంలో పారితోషికం చెల్లించారు. విజయ్ రెమ్యునరేషన్ విషయంలో అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. దీంతో ఈ చిత్ర నిర్మాత, హీరోలపై ఐటీ శాఖ కన్నేసింది. పన్నులు ఎగ్గొట్టారనే అనుమానంతో భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది. ‘బిగిల్’ సినిమాను నిర్మించిన ఏజీఎస్ గ్రూప్ కార్యాలయాల్లో బుధవారం సోదాలు నిర్వహించిన అనంతరం ఐటీ అధికారులు విజయ్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ‘మాస్టర్’ సినిమా షూటింగ్‌లో విజయ్ బిజీగా ఉన్నారు. కుడ్డలూర్ జిల్లాలోని నెయ్వేలిలో షూటింగ్ జరుగుతోంది. దీంతో ఐటీ అధికారులు నేరుగా నెయ్వేలి వెళ్లి షూటింగ్ జరుగుతున్న చోటే విజయ్‌ను విచారించారు. విజయ్‌ను ఐటీ అధికారులు ఏకంగా ఐదు గంటల పాటు విచారించినట్టు సమాచారం. అంతేకాకుండా, విజయ్‌ను నెయ్వేలి నుంచి చెన్నైకు రోడ్డు మార్గంలో ఐటీ అధికారులు తీసుకెళ్లినట్టు తెలిసింది. ‘బిగిల్’ నిర్మాణ సంస్థ నుంచి విజయ్‌కు ముట్టిన మొత్తంపై ఆరా తీసేందుకు ఆయన్ని చెన్నై తీసుకెళ్లినట్టు సమాచారం. విజయ్‌ను ఐటీ అధికారులు చెన్నై తీసుకెళ్లడంతో బుధవారం నాటి షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. గురువారం నుంచి యథావిథిగా షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపించడంలేదు. అయితే భారీ మొత్తంలో ఆదాయపు పన్ను ఎగ్గొట్టారనే అనుమానంతో ఏజీఎస్ గ్రూపునకు సంబంధించి 20 చోట్ల సోదాలు నిర్వహించామని, అనంతరం విజయ్‌ను ప్రశ్నించామని చెప్పిన ఐటీ అధికారులు.. విజయ్ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారనే విషయాన్ని చెప్పలేదు. అలాగే, మదురైకి చెందిన నిర్మాత, ఫైనాన్షియర్ అంబు చెళియన్‌ను ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. సోదాలన్నీ పూర్తయిన తరవాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కాగా, ‘బిగిల్’ సినిమా నిర్మాతలు, హీరో విజయ్‌‌ను ఐటీ అధికారులు విచారించారనే వార్త ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.

Related posts