ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ లో మరో ఘోరానికి పాల్పడ్డారు. సోఫియాన్ లో ఖుష్బూ అనే ఓ స్పెషల్ పోలీసు అధికారిణిని ఆమె నివాసం ఎదుట కాల్చి చంపారు. శ్రీనగర్ కు దక్షిణాన దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో సోఫియాన్ ఉంది. మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో ఆమెపై ముష్కరులు తుపాకీ గుళ్లను కురిపించారు. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు.
జమ్ముకశ్మీర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, ఆమె తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఆసుపత్రిలో ఆమె మృతి చెందారని చెప్పారు. ఉగ్రవాదుల కిరాతక చర్యలను తాము ఖండిస్తున్నామని… ఈ క్లిష్ట సమయంలో ఖుష్బూ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. మరోవైపు, కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించారు. ఉగ్రవాదుల కోసం గాలింపును చేపడుతున్నారు.