23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని దేశవ్యాప్తంగా ప్రజలు, ఆయా పార్టీ నేతలు వేయి కళ్ళు చేసుకొని ఎదురుచూస్తున్నారు.. ఇంకా ఒక విడత ఎన్నిక మరో రెండు రోజులలో జరగనుంది. మొత్తానికి నిన్నటితో ఏడువిడతల ఎన్నికలకు ప్రచారహోరు ముగిసింది. ఎండలు అని కూడా ఆలోచించక నేతలు భారీగా ప్రచారంలో పాల్గొన్నారు. అగ్రనేతల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. వారివారి పార్టీలను గెలిపించాలని ప్రస్తుత ప్రధాని మోడీ నుండి విపక్షాల వరకు అందరూ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ప్రశాంతంగా ఫలితాల కోసం ఎదురుచూద్దాం అనుకునే లోపు, ఉగ్రభూతం తన పంజా విసిరేందుకు సిద్ధంగా ఉందని ఇంటెలిజెన్స్ మరో షాక్ ఇచ్చింది. ఎప్పుడు ప్రజావేదికలను తమ లక్ష్యాలుగా చేసుకొనే ఉగ్రవాదులు, దేశంలో అనిచ్చితి ఎన్నికల సమయం సరైనదని తలచి, తమపని తాము చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ విషయం గ్రహించిన ఇంటెలిజెన్స్ రక్షణ వ్యవస్థను అప్రమత్తంగా ఉండాలని గట్టిగానే హెచ్చరించింది.
ఈ సమయంలో దాడులు చేయడం కూడా చాలా సులభమే అని చెప్పాలి. రక్షణ వ్యవస్థలో చాలా భాగం ఎన్నికల లో రక్షణలో తీరిక లేకుండా ఉంటారు.. ఇక మిగిలిన ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువగానే ఉంటుంది. దీనితో తమకు ఇదే కలిసివచ్చే కాలం అనుకున్న ఉగ్రవాదులు దేశంలో పలుచోట్ల తమ పాశవికతను చూపించడానికి అనేక ప్రణాళికలు రచించారు. ఇప్పటివరకు అనేక దాడులను ముందే గ్రహించి, ప్రజలను రక్షించిన ఘనత రక్షణ వ్యవస్థకు ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు పుల్వామా తరహా ఘటనలు చెంపపెట్టులా ఉంటున్నాయి. మరి 23న దేశభవిష్యతును నిర్దేశించే ఫలితాలే వెలువడనున్నాయా.. లేక ఉగ్రభూతాల ప్రణాళికలు ఫలించనున్నాయా అనేది మరో వారంలో తేలిపోతుంది. ఎందుకైనా మంచిది, ఎవరి జాగర్తలో వారు ఉంటూ, చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉండటం మేలు! మళ్ళీ రక్షణ వ్యవస్థ గెలవాలని కోరుకుందాం..!ఎన్నికలలో ఎవరు గెలిచేది ఇప్పటికే ప్రజలు నిర్ణయించారు.