మనిషి రాక్షసుడు అయితే ఎంత వికారంగా ఉంటుందో చెప్పడం కష్టం, కానీ రాక్షసుడు మనిషిగా అంతకు మించి మంచివాడైతే అది మాత్రం మాటలలో చెప్పలేని అనుభూతినిస్తుంది. అలాంటి వారికి సహకరించి, మనతో కలిసి జీవించనిస్తే, వాళ్ళు సాధించే విజయాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. అదే జరిగింది ఒక ఉగ్రవాది జీవితంలో. మరలనుకున్నాడు, మారాడు.. నేడు మన మధ్య లేకున్నా, దేశంలో అత్యున్నత పురస్కారం అశోక చక్ర గెలుచుకున్నాడు. ఇదేకదా మార్పు అంటే. వివరాలలోకి వెళితే, దక్షిణ కశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు అర్పించిన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానికి ఈ ఏడాది అశోక్ చక్ర అవార్డును ప్రదానం చేయనున్నారు. ఉగ్రవాదులతో విరోచితంగా పోరాడిన నజీర్కు మరణాణంతరం ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఆయన కుటుంబసభ్యులు ఈ అవార్డును స్వీకరించనున్నారు.
కశ్మీర్లో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో నజీర్ తన వీరత్వాన్ని ప్రదర్శించారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడంలో సహకరించాడు. ఆ తర్వాత గాయపడ్డ జవాన్లను సురక్షిత ప్రాంతానికి చేర్చడంలోనూ సాయం చేశాడు. అందుకే ఆర్మీలోని అత్యున్నత అవార్డును ఇస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి నజీర్ అహ్మద్ వాని ఒకప్పుడు ఉగ్రవాదిగానే ఉన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల అతను ఆర్మీ ముందు లొంగిపోయాడు. ఆ తర్వాత కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాదుల నిర్మూలనకు అతను సహకరించాడు. టెరిటోరియల్ ఆర్మీలోని 162వ బెటాలియన్లో 2004లో నజీర్ అహ్మద్ వాని చేరాడు. కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్లో పాల్గొన్నాడతను. కుల్గామ్కు చెందిన అతను సేనా మెడల్ను రెండుసార్లు నెగ్గాడు. గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఎన్కౌంటర్లో ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.