వోల్టేజీ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్థులు సమస్య పరిష్కారం కోసం ఒక్కటయ్యారు. గ్రామంలో బిల్లుల వసూల కోసం వచ్చిన విద్యుత్తు సిబ్బందిని పట్టుకుని కట్టేసిన గ్రామస్థులు ఒక్కొక్కరినీ పిలిచి బంధించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగింది.
మండలంలోని గడిపెద్దాపూర్ సబ్స్టేషన్ నుంచి ముస్లాపూర్, ముస్లాపూర్ తండా, గడిపెద్దాపూర్, తండాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్య ఉండడంతో ఇళ్లలోని గృహోపకరణాలుకాలిపోతున్నాయి. సమస్య పరిష్కరించాల్సిందిగా ఏళ్ల తరబడి గ్రామస్థులు చేస్తున్న విజ్ఞప్తులను అధికారులు పట్టించుకోవడం లేదు.
దీంతో విసిగిపోయిన గ్రామస్థులు విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు గ్రామానికి వచ్చిన బిల్ కలెక్టర్లు, లైన్మ్యాన్ లను పంచాయతీ భవనంలోని పిల్లరుకు కట్టేశారు. ఆ తర్వాత ఏఈ రాంబాబుకు సమాచారం ఇచ్చారు. ఆయన గ్రామానికి రాగానే నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్నస్థానిక ఎస్సై గ్రామస్థులతో చర్చించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సిబ్బందిని విడిచిపెట్టారు.