సౌదీలో భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లడం, ఇక్కడివారో లేక అక్కడ వారో మోసం చేయటంతో కష్టాల కడలిలో మిగిలిపోతున్నవారు చాలా మందే ఉన్నారు. వారు టెక్నాలజీ ఉపయోగించి బయటపడటానికి తమ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సమీర్ అనే యువకుడు సౌదీ అరేబియాలో తాను పడుతున్న కష్టాలను ఓ వీడియో రూపంలో పంపడం కలకలం సృష్టించింది. యజమాని చేతిలో చిక్కుకున్న తాను ఎడారిలో గొడ్డుచాకిరీ చేస్తున్నానని కన్నీటిపర్యంతం అయ్యాడు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి భారత విదేశాంగ శాఖను అప్రమత్తం చేసింది. మహ్మద్ సమీర్ సౌదీ అరేబియాలో ఎక్కడ ఉన్నదీ అక్కడి దౌత్య వర్గాలు గుర్తించలేకపోయాయి.
తెలంగాణ నుంచి సౌదీ వెళ్లిన కొందరు వ్యక్తులు చొరవ తీసుకుని సమీర్ ఆచూకీ కనుగొన్నారు. వారికి ఈ వ్యవహారంలో సాయపడింది కొందరు పాక్ దేశస్తులు. పాకిస్థానీలు ఎంతో శ్రమించి మహ్మద్ సమీర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించడమే కాదు, అధికార వర్గాల సాయంతో అతడి యజమాని నుంచి విముక్తి కలిగించే వరకు పట్టువదల్లేదు. మొత్తమ్మీద మహ్మద్ సమీర్ ను రియాద్ లోని భారత దౌత్య కార్యాలయానికి చేర్చారు. ప్రస్తుతం అతడిని భారత్ పంపేందుకు అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తిచేస్తున్నారు. త్వరలోనే సమీర్ సొంతగడ్డపై అడుగుపెట్టనున్నాడు.