వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. సమగ్ర సమాచారంతో ఈ నెల 30 తేదీన లెక్కింపు వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తమ ముందుకు రావాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మల్రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి 376 ఓట్ల తేడాతో మల్రెడ్డి రంగారెడ్డి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఆ ఓట్ల లెక్కింపులో లోపాలపై తన చీఫ్ ఎన్నికల ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారని రంగారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వినతి పత్రం తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదని ప్రస్తావించారు.