ఏపీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు రాష్ట్రంలోని సమస్యలు, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ మేనిఫెస్టోను రూపొందించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రజల సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు అందకపోయినా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో యనమల మాట్లాడారు.
యనమల అమరావతి, పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. షెడ్యూల్ 9,10 సంస్థలను జనాభా ఆధారంగా ఆస్తులను విభజిస్తే రూ.43,000 కోట్లు రావాలని తెలిపారు. వీటిలో ఒక్క రూపాయి కూడా ఏపీకి రాలేదన్నారు. జగన్, మోదీ, కేసీఆర్ లతో చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరచిన అన్ని హామీలను నెరవేర్చామని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం: భట్టి