తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులు కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. గత రెండున్నరేళ్లుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ ప్రభుత్వం అలసత్వం మూలాన గ్రూప్ -2 మెరిట్ జాబితాలో పేరు ఉన్నప్పటికీ ఫలితాలు వెలువడక మానసిక క్షోభకు గురవుతున్నామని తెలిపారు. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ ఎదుట శుక్రవారం నిరసన చేపట్టి అనంతరం వినతిపత్రం సమర్పించారు.
టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణ దశ నుంచి చేస్తున్న తప్పిదాల వల్ల మెరిట్ లిస్టులో ఉన్న తాము బాధితులుగా మారామని ఆందోళన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి విన్నవించినా, టీఎస్పీఎస్సీ అధికారులను కలిసినా వారిలో కనీస స్పందన కూడా లేదన్నారు. దీనితో ఉద్యోగం రాక, వేరే ఉద్యోగం చేయలేక ఇంటా బయటా ఎన్నో అవమానాలు ఎదర్కొంటున్నామని మానవ హక్కుల కమిషన్ ఎదుట వాపోయారు.