సోషల్ మీడియాలో ఏ వార్త వచ్చినా ప్రజలు ముందుగా హడావుడి చేస్తున్నారు తప్ప, అందులో నిజం ఎంత అనేది ఆలోచించలేకపోతున్నారు. దీనితో రోజుకు ఒక సమస్య అనవసరంగా అధికారుల, ప్రభుత్వ సమయాన్ని వృధా చేస్తుంది. తాజాగా, వేసవి సెలవుల్లో సినిమాలను ఆస్వాదించాలనుకున్న వారికి ఊహించని షాక్ తగిలిందనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ప్రభుత్వ అనుమతులతోనే సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 80 నుండి 110 రూపాయలకు, మల్టిఫ్లెక్స్ థియేటర్ లలో 138 నుండి 200 రూపాయల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు పలు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి.
దీనిపై రాష్ట్ర సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినిమా టికెట్ల ధరలు పెంచలేదని, ధరల పెంచుతున్నట్టు వస్తున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు.వివిధ ప్రసార మాధ్యమాలు చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి తెలిపారు. టికెట్ ధరల పెంపు విషయంలో థియేటర్ల యాజమాన్యాలకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.