నౌకాశ్రయాలు సీమాంధ్రకు ప్రకృతి ఇచ్చిన వరమని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఈ ప్రయత్నాలు ఇంకా తెరవెనుక జరుగుతూనే ఉన్నాయని దుయ్యబట్టారు. గత నెల 28న ఆర్టీ-62 పేరుతో ఇందుకోసం ఓ రహస్య జీవోను జారీచేశారనీ, ఆ తర్వాత మాటమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోర్టు విషయంలో అసెంబ్లీలోనూ వైసీపీ ప్రభుత్వం బుకాయించిందని విమర్శించారు. పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్-జగన్ స్నేహాలకు రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే టీడీపీ సహించబోదని హెచ్చరించారు. మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు, దాని ఆధారంగా పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని చంద్రబాబు గుర్తుచేశారు.