భాజపా గురువారం ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలను నిరసిస్తూ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు మద్దతు తెలపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 29 నుంచి మొదలుపెట్టిన తన నిరవధిక దీక్షను విద్యార్థులకు న్యాయం జరిగేవరకు కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
ఆందోళనలు, నిరసనలను తెరాస ప్రభుత్వం అప్రజాస్వామికంగా అణచివేస్తోందని, బంద్ను విఫలం చేయడానికి కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. బంద్ను విజయవంతం చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు వ్యాపార, విద్యాసంస్థలకు ఆయా యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాలన్నారు. ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై ఇప్పటివరకు చర్యలు లేవని, విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఇంటర్బోర్డు కార్యదర్శి అశోక్ ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతుంటే విద్యార్థుల ఆందోళన ఎలా తగ్గుతుందని లక్ష్మణ్ ప్రశ్నించారు.
అధికార దుర్వినియోగంతో విద్యార్థులకు న్యాయం జరగాలని దీక్షకు దిగితే భగ్నం చేసే ప్రయత్నం చేశారన్నారు. అయినా నిమ్స్లో తన దీక్షను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం లేదని, విద్యార్థులకు న్యాయం జరగడమే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.నిమ్స్లో దీక్ష కొనసాగిస్తున్న లక్ష్మణ్కు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.