నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 2019 మార్చి 29తో ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 1న ఓటర్ల జాబితా కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబరు 6న ఓటు నమోదుకు చివరి తేదీగా నిర్ణయించగా 18,536 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి 17,869 మందితో ఓటర్ల జాబితాను రూపొందించారు.
ఇందులో వరంగల్ జిల్లాలో 7,556 మంది, ఖమ్మంలో 4,315 మంది, నల్లగొండలో 6,665 మంది ఉన్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 667 దరఖాస్తులను తిరస్కరించి 17,869 మంది ఓటర్లతో ముసాయిదా జాబితాను తయారుచేశారు. ఇందులో 11,642 మంది పురుషులు, 6,224 మంది మహిళలు, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. కాగా గత ఎన్నికలతో పోలిస్తే ఓటు నమోదుపై వివిధ కేటగిరిలోని ఉపాధ్యాయులు పెద్దగా శ్రద్ధ చూపనట్టుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మూడు జిల్లాల్లో కలిపి 20,441 మంది ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోగా ఈసారి 2,572 మంది తగ్గి 17,869 మంది నమోదు చేసుకొన్నారు.