ఏపీ బడ్జెట్ పై టీడీపీ నేత, మాజీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సున్నా వడ్డీపై అసెంబ్లీలో నానా హంగామా చేసి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని విరుచుకుపడ్డారు. బడ్జెట్ లో నవరత్నాలు గురించి ప్రస్తావించిన జగన్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. జగన్ సర్కార్ కు దశ ఉంది కానీ దిశలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇరిగేషన్ శాఖకు రూ.1000 కోట్లు నిధులు తగ్గించారని ఆరోపించారు. బడ్జెట్ లో ప్రకటించిన అన్ని పథకాలకు వైయస్ఆర్, జగన్ పేర్లు తప్ప వేరే పేర్లు లేవా అని నిలదీశారు. కొన్ని పథకాలకైనా కనీసం అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగం, డా.బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల పేర్లు పెడితే బాగుండేదని సూచించారు. అప్పులు గురించి నీతులు చెప్పిన వైసీపీ ఇప్పుడు అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు.