జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్, లడఖ్ లుగా విభజించింది. లడఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. జమ్ముకశ్మీర్ ను అసెంబ్లీ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది. జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కలిపించే ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది.
రాష్ట్ర పునర్విభజనకు సంబంధించిన బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా జమ్మూకశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దూరమవుతాయని చెప్పారు. తాజా నిర్ణయం కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు పొందుతున్న అవకాశాలను జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా పొందుతారని ఆయన అన్నారు.