వైసీపీ ప్రభుత్వమే రాజధాని సమస్యకు కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతి అభివృద్ధి పథంలో సాగుతున్న క్రమంలో, అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి ప్రజల్లో ఆందోళనలు రేపిందని ధ్వజమెత్తారు.
మూడు రాజధానులపై బోస్టన్ కమిటీ కేవలం ఐదు రోజుల్లోనే నివేదిక ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును కమిటీ ఐదు రోజుల్లోనే తేల్చేస్తుందా? అంటూ ప్రశ్నించారు. ప్రధాని రాజధానికోసం శంకుస్థాపన చేసి నిధులు ఇచ్చాక రాజధాని మార్చుతామనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ తీరును కేంద్రం చూస్తూ ఊరుకుంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు.