పోలవరం ప్రాజెక్టు పనులపై ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిపై టీడీపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత చంద్రబాబుపై కోపంతో జగన్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తారో తెలియడం లేదన్నారు. రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం ఉందనే బొత్స వ్యాఖ్యలపై సోమిరెడ్డి స్పందించారు. 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా అమరావతికి ఏమీ కాదని ఆయన అన్నారు.
పిపిఎలపై రివ్యూల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కూడా కష్టంగా మారిందని ఆయన అన్నారు. కేంద్రమే పోలవరం బాధ్యతలు తీసుకుని, దాన్ని నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. జగన్ కు పేరు వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి నిర్మాణ బాధ్యతలు తమకు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం కోరితే కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. నవయుగకు కాంట్రాక్టు ఇచ్చినప్పుడు అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ అంగీకరించారని గుర్తు చేశారు.