రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుని ఈరోజు ఢిల్లీలో కలిశారు. వెంకయ్యను కలిసిన వారిలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి ఉన్నారు.రాజ్యసభలో టీడీపీ పక్షం విలీనం చెల్లదంటూ ఆయనకు ఓ లేఖ సమర్పించారు. టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడం ఫిరాయింపుల కిందకే వస్తుందని ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు.
అనంతరం మీడియాతో గల్లా జయదేవ్ మాట్లాడుతూ, బీజేపీలో టీడీపీ రాజ్యసభా పక్షం విలీనం రాజ్యాంగ విరుద్ధమని, నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని తమ లేఖలో కోరామని చెప్పారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీల విలీనానికే అవకాశం ఉందని అన్నారు. పార్టీ మారిన టీడీపీ ఎంపీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సీతారామలక్ష్మిని ఎంపిక చేశామని తెలిపారు.