ఏపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఒక్క చాన్స్ ఇచ్చి ప్రజలు మోసపోయారని విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా మహమ్మారి ధాటికి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే సీఎం జగన్ తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటున్నారని ఆరోపించారు.
ప్రతిరోజు పదివేలకు పైగా కొత్త కేసులు, 100 మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. కరోనా బాధితులు వైద్యం అందక ప్రాణాలు రక్షించమని వేడుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి బీసీలపై కక్ష తీర్చుకున్నారని మండిపడ్డారు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం రద్దు చేయడమే కాకుండా, ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు కూడా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. సన్నబియ్యం హామీ నిలబెట్టుకోలేక పోగా, 18 లక్షల రేషన్ కార్డులు తొలగించారని విమర్శించారు. 15 నెలల కాలంలో 400 అత్యాచార ఘటనలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రసాద్ అనే దళిత యువకుడు నక్సల్స్ లో చేరాలనుకునే పరిస్థితి తీసుకువచ్చారని లోకేశ్ మండిపడ్డారు.
ప్రశ్నిస్తున్నందునే నన్ను సస్పెండ్ చేశారు: అచ్చెన్నాయుడు