టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుని టీడీపీ ఎంపీలు ఈరోజు ఢిల్లీలో కలిశారు. రాజ్యసభలో టీడీపీ పక్షం విలీనం చెల్లదంటూ ఆయనకు ఓ లేఖ సమర్పించారు.
టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడం ఫిరాయింపుల కిందకే వస్తుందని ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. వెంకయ్యను కలిసిన వారిలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి ఉన్నారు.