telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈసీ ఆఫీస్‌లో విజయసాయిరెడ్డికి రాచ మర్యాదలు: బుద్దా వెంకన్న

ఈసీ ఆఫీస్‌లో విజయసాయిరెడ్డికి రాచ మర్యాదలు చేయడం ఏంటని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఎన్నికలు సజావుగా జరగడానికి కేంద్రం ప్రత్యేక భద్రత దళాలను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి ఈసీని కలిసొచ్చి చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అన్నట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. విజయసాయి బయటకు వచ్చి మేము అడిగిన అధికారులను బదిలీ చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పారని విమర్శించారు. ఈసీకి, వైసీపీని బీజేపీ జతచేసిందని ఆయన ఆరోపించారు.

ఏపీలో జరిగిన అన్యాయాన్ని ఇతర రాష్ట్రాల్లో జరగకూడదనే ఉద్దేశంతో ఈసీని చంద్రబాబు కలిశారన్నారు. దానికి తామేదో భయపడ్డమని విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయి, ఓక్స్ వాగన్ కేసులో పేరున్న బొత్సకు ఈసీ అపాయింట్‌మెంట్ ఇస్తుందా? అని బుద్దా వెంకన్న మండిపడ్డారు. చెత్తలో దొరికిన వీవీ పాట్‌ల విషయంపై ఈసీ ఏమి సమాధానం చెపుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు వారణాసికి కూడా వస్తారని, మోదీకి వ్యతిరేకం గా ప్రచారం చేస్తారని బుద్దా వెంకన్న అన్నారు. మే 23న ఈ కుట్రలన్నిటికి ఓటర్లు సమాధానం చెపుతారని అన్నారు.

Related posts