ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐఆర్ విషయంలో తీసుకున్న నిర్ణయం పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి(ఐఆర్) విషయంలో సీఎం జగన్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 1వ తేదీ నుంచి మాత్రమే ఐఆర్ ఇస్తామని సీఎం చెప్పడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణను కోరుకున్నారనీ, మధ్యంతర భృతిని కాదని స్పష్టం చేశారు. సీఎం జగన్ నిర్ణయంతో ఈ ఏడాది ఏప్రిల్-జూలై నెలల మధ్య పదవీవిరమణ చేసినవారికి తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.