బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలపై ఆ పార్టీ నేత రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ హోదా, గౌరవం కల్పించిన పార్టీకి ద్రోహం చేయడం బాధాకరమని అన్నారు. బీజేపీ ఫిరాయింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయని, పార్టీ బలహీనపడుతోందన్న ఆలోచన ఏ ఒక్కరికీ రాకూడదని అన్నారు. తమ అజెండా కొనసాగిస్తామని, రాష్ట్ర అంశాలపై బలంగా పోరాడతామని చెప్పారు. తమ పార్టీ సిద్ధాంతాలను వదలుకోమని, టీడీపీ తరపున పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. టీడీపీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా వైసీపీపై ఆయన విమర్శలు చేశారు. రాజకీయ అవకాశంగా తీసుకుని వైసీపీ బురదజల్లే పనులు చేస్తోందని అన్నారు. ప్రజలు వైసీపీని అన్ని స్థానాల్లో గెలిపించింది అభివృద్ధి కోసమే తప్ప రాజకీయాలు చేయడం కోసం కాదని అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. తాజాగా, ఢిల్లీలో నిర్వహించిన టీడీపీ ఎంపీల సమావేశంలో కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ, రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా వారు ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయమై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయని, పార్లమెంటులో ప్రజల గొంతుకను వినిపిస్తామని చెప్పారు.