అనంతపురం జిల్లాలో టీడీపీ నేత చంద్రశేఖర్ నాయుడుకు చెందిన చీనీ తోటలను గుర్తుతెలియని దుండగులు నరికేశారు. చిన్నమల్లేపల్లికి చెందిన చంద్రశేఖర్ 3 ఎకరాల్లో 300 చెట్లను సాగు చేశారు. వీటిలో 70 చెట్లను నరికివేశారు. దీంతో చంద్రశేఖర్ నాయుడు పోలీసులకు సమాచారం అందించారు. లక్షలు పోసి కన్నబిడ్డల్లా సాగుచేసిన చెట్లను నరికివేశారని టీడీపీ నేత చంద్రశేఖర్ నాయుడు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, యామినీబాల, తదితరులు ఘటనాస్థలికి సందర్శించారు. ఈ ఘటన పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు పదేళ్ల కిందట ఇలాంటి సంస్కృతి ఉండేదని తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతులను వదిలేయాలని సూచించారు. తమ కార్యకర్తలకు చెందిన ఆస్తులను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎస్ఐ కిరణ్ కుమార్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన జేసీ దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.